కాంగ్రెస్ దోకాబాజ్ పార్టీ..ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను ఏడిపించిందిః సిఎం కెసిఆర్
తెలంగాణలో 24 గంటల పాటు నల్లా నీళ్లు ఉండే స్కీం ఏర్పాటు చేస్తున్నాం..కెసిఆర్

కరీంనగర్ : కరీంనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ పాల్గొని గంగుల కమలాకర్కు మద్దతుగా ప్రసంగించారు. గంగుల కమలాకర్ నేతృత్వంలో కరీంనగర్ పట్టణం ఎంతో సుందరంగా తయారైంది. కరీంనగర్ పట్టణం అని కాకుండా, కరీంనగర్ నరగం అని పిలవాలనిపిస్తోంది. గంగుల కమలాకర్ మొండి మనిషి, పట్టిన పట్టు విడవడు కాబట్టి వెంటపడి ఆ మానేరు రివర్ పంట్ర్ కట్టిస్తున్నాడు. కరీంనగర్లో చౌరస్తాలు, రోడ్లు, సందులు అద్భుతంగా తయారయ్యాయి. అద్దంలో చూపించిన స్పష్టమైన తేడా కనబడుతుంది. ప్రజల యెడల అభిమానం ఉండి, పని చేసే ప్రభుత్వం ఉంటే, అభివృద్ధి ఎలా ఉంటుందో దానికి కరీంనగర్ అభివృద్ధి నిదర్శనం అని కెసిఆర్ పేర్కొన్నారు.
ఒకసారి మానేరు రివర్ ఫ్రంట్ పూర్తయితే కరీంనగర్ పట్టణం పర్యాటక ప్రాంతంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సందర్శకులు వస్తున్నారు రూ. 410 కోట్లతో ముమ్మురంగా పనులు జరుగుతున్నాయి. మానేరు మునుపు ఎలా ఉండేనో ఆలోచించాలి. నెత్తి మీద డ్యాం ఉన్న కరీంనగర్కు నీళ్లు రాని పరిస్థితి. ఇవాళ ప్రతి రోజులు నీళ్లు వస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణలో 24 గంటల పాటు నల్లా నీళ్లు ఉండే స్కీం ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పుడు తిప్పుకుంటే అప్పుడే వచ్చేటట్టు ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. ఒక రూపాయికి నల్లా కనెక్షన్ ఎవడైనా ఇచ్చిండా..? ఇవాళ ఒకటే రూపాయికి నల్లా కనెక్షన్ ఇవ్వడంతో, మహిళలు బిందెలు పట్టుకుని బజారుకు రావడం లేదు. ఇవాళ బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి. ఇది అభివృద్ధి కాదా..? ఇవన్నీ ఆలోచించాలి. ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి ఇవి తొలి అడుగులు అని కెసిఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ దోకాబాజ్ పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను దశాబ్దాల పాటు ఏడిపించిందన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో విజయాలకు కరీంనగర్ కేంద్ర బిందువుగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రజలకు, వ్యక్తిగతంగా తనకు ఎన్నో విజయాలను అందించిందని, ఇందుకు కరీంనగర్ గడ్డకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. 2011 మే 17న మొట్టమొదటి సింహగర్జన సభ ఇదే వేదికపై జరిగిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం తీసుకరాకపోయినా, ఉద్యమాన్ని విరమించినా తనను రాళ్లతో కొట్టి చంపండని నాడు ఇక్కడ జరిగిన సభలో చెప్పానని గుర్తు చేశారు. దళితబంధు, రైతుబంధు, రైతు బీమా లాంటి అనేక మంచి కార్యక్రమాలను కరీంనగర్ వేదిక నుంచే ప్రారంభించుకున్నామన్నారు. కాంగ్రెస్ 1969లో ఉద్యమం చేస్తే 400 మందిని కాల్చిచంపిన పార్టీ అన్నారు. 2004లో మనతో పొత్తుపెట్టుకుని రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ తర్వాత ఆర్నెళ్లకో, ఏడాదికో తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు మోసం చేశారన్నారు. పదమూడేళ్లు పోరాడితే కానీ తెలంగాణ రాలేదన్నారు. కాంగ్రెస్ మన పార్టీని చీల్చే ప్రయత్నాలు కూడా చేసిందన్నారు. దాంతో కెసిఆర్ శవయాత్రనో, తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలని నేను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టానని, ఆ దీక్షకు కూడా కరీంనగర్ గడ్డనే వేదిక అయిందన్నారు. తనను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టారన్నారు. కరీంనగర్ ఉద్యమాల గడ్డ అన్నారు.
ఒక దేశమైనా, రాష్ట్రమైనా బాగుందా? లేదా? అని చూసేందుకు రెండు కొలమానాలు ఉంటాయని, అందులో ప్రధానమైనది తలసరి ఆదాయం అన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో మన ర్యాంకు ఇరవైలో ఉండెనని, కానీ ఇప్పుడు మన తెలంగాణ రూ.3.18 వేల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందన్నారు. కడుపు నోరు కట్టుకుని, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామన్నారు. ఇక రెండో గీటురాయి తలసరి విద్యుత్ వినియోగమని, 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1,122 యూనిట్లుగా ఉండెనని, ఇప్పుడు 2,040 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో దేశంలో నెంబర్ 1గా ఉన్నామన్నారు.