రేపు కృష్ణ పార్ధివ దేహానికి నివాళ్లు అర్పించనున్న సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ రేపు (నవంబర్ 16) హైదరాబాద్ కు రానున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం 4:07 గంటలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో కన్నుమూశారు.

కృష్ణ మృతి ప‌ట్ల సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. కాగా, కృష్ణ పార్ధివ దేహానికి నివాళుల‌ర్పించేందుకు సీఎం జ‌గ‌న్ రేపు(బుధ‌వారం) హైద‌రాబాద్ వెళ్తున్నారు. అనంత‌రం కృష్ణ కుటుంబ స‌భ్యుల‌ను సీఎం జ‌గ‌న్ ప‌రామ‌ర్శించ‌నున్నారు. అలాగే కృష్ణ మృతికి సంతాపంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ కీలక ప్రకటన చేసింది. కృష్ణ మృతికి సంతాపంగా రేపు (బుధవారం) విజయవాడ నగర పరిధిలోని అన్ని సినిమా హాళ్లలో సినిమా ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్లు ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. సినీ అభిమానులు అందుకు సహకరించాలని కోరింది. విజయవాడతో కృష్ణకు మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛాంబర్ తన ప్రకటనలో వెల్లడించింది.

మరోపక్క కృష్ణ మృతికి సంతాపంగా రేపు సినిమా షూటింగ్ లను నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. కృష్ణ మృతికి సంతాపంగా రేపు సినీ పరిశ్రమ కార్యకలాపాలు, షూటింగ్ లు రద్దు చేసుకోవాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన విజ్ఞప్తి మేరకే నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుంది.