కృష్ణానది కరకట్ట పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన

15.525 కి.మీ. కరకట్ట విస్తరణ పనులకు శంకుస్థాపన
పనుల కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం

అమరావతి : సీఎం జగన్ కృష్ణానది కరకట్ట పనులకు శంకుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కిలోమీటర్ల మేర కరకట్ట విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ. 150 కోట్లు ఖర్చు చేయనుంది. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో ఈ పనులను చేపట్టనున్నారు.

10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రోడ్డుతో పాటు ఇరువైపులా నడక దారులను నిర్మించనున్నారు. ఈ మార్గం వల్ల అమరావతిలోని ఎన్-1 నుంచి ఎన్-3 రోడ్లకు, అలాగే ఉండవల్లి-రాయపూడి-అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్, విజయవాడ బైపాస్-చినకాకాని-గొల్లపూడి రోడ్లకు అనుసంధానం కలుగుతుంది. కరకట్ట రహదారి ద్వారా అమరావతి, హైకోర్టు, సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, తుళ్లూరు, పెనుమాక, ఉండవల్లి, ఉద్దండరాయునిపాలెం, మందడం, రాయపూడి, వెంకటపాలెం, వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం తదితర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, సుచరిత, రంగనాథరాజు, నారాయణస్వామి తదితరులు హాజరయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/