భోగాపురం ఎయిర్ పోర్ట్ కి శంకుస్థాపన చేసిన సిఎం జగన్‌

CM Jagan laid the foundation stone of Bhogapuram Airport

భోగాపురంః సిఎం జగన్‌ విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ కి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ని రూ.4952 కోట్లతో నిర్మించబోతున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ పనులను జీఎంఆర్ విశాఖ ఇంటర్నేషనల్ చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ ఎయిర్ పోర్ట్ 4 కోట్ల జనాభాకు సరిపోయేలా డిజైన్ చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా 7 ఎయిరో బ్రిడ్జిలు, కార్గో టెర్మినల్, ఎం ఆర్ వో సెంటర్ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఎ 320, ఎ 380 డబుల్ డెక్కర్ ఫ్లైట్స్ ల్యాండయ్యేలా రన్ వే ఉండబోతోందన్నారు. 2026 ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సపోర్ట్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు, పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు.

పోర్టు నిర్మాణంలో భాగంగా భూములు ఇచ్చిన 4 గ్రామాల ప్రజలకు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లు కట్టించి పునరావాసం కల్పించామని సీఎం జగన్ తెలిపారు. విశాఖపట్టణంలో త్వరలో అదానీ డేటా సెంటర్ కి శంకుస్థాపన చేయబోతున్నట్లు సీఎం జగన్ చెప్పారు. తద్వారా ఐటీ రంగం వృద్ధి సాధించనున్నట్లు పేర్కొన్నారు.