ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సిఎం జగన్..!
రాజకీయ సహకారంపై అమిత్ షాతో చర్చించనున్న జగన్
అమరావతిః ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్టు సమాచారం. అయితే, ఇది అధికారిక పర్యటన కాదని, పూర్తి స్థాయిలో రాజకీయ పర్యటన అని చెపుతున్నారు. రేపు లేదా ఎల్లుండి ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. తన పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య సహకారంపై వీరు చర్చించనున్నారు. వైసీపీకి సహకరిస్తే ఒక రాజ్యసభ సీటును బిజెపికి ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్టు చెపుతున్నారు.
మరోవైపు ఏపీ రాజకీయాలు హీటెక్కిన సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిల రాకతో రాజకీయాలు మరింత రంజుగా మారాయి. షర్మిల నేరుగా తననే టార్గెట్ చేస్తుండటం జగన్ కు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో బిజెపి పెద్దలను కలిసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం.