గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు సీఎం జగన్‌ ఆత్మీయ వీడ్కోలు

గవర్నర్ పాదాలకు నమస్కరించి.. ఘనంగా వీడ్కోలు

cm-jagan-farewell-governor-biswabhusan-harichandan-gannavaram-airport

అమరావతిః గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు సీఎం వైఎస్ జగన్ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. తద్వారా గవర్నర్ పట్ల తన గౌరవం చాటుకున్నారు. ముందుగా గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యంగా గవర్నర్ పాదాలకు నమస్కరించి ముఖ్యమంత్రి జగన్ అందరినీ ఆశ్చర్యపరిచారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లిపోవడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ వీడ్కోలు కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, సీఎస్, డీజీపీ పాల్గొన్నారు. ఇటీవల ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ బదిలీ అయ్యారు. మూడున్నరేళ్ల పాటు ఏపీ గవర్నర్ గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.

గవర్నర్ ను సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పాలనను విశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసించారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఏ వర్గాన్ని కూడా విస్మరించడం లేదని అభినందించారు. గవర్నర్ కు వీడ్కోలు పలికిన వారిలో మంత్రి జోగి రమేష్, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇక ఏపీకి కొత్త గవర్నర్‌ గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేడు రాష్ట్రానికి రానున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో నూతన గవర్నర్‌కు సీఎం జగన్‌ స్వాగతం పలకనున్నారు. ఎల్లుండి గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటకకు చెందిన అబ్దుల్‌ నజీర్‌ సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకుండానే సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన మూడో న్యాయమూర్తిగా జస్టిస్ నజీర్ గుర్తింపు పొందారు. ఈ ఏడాది జనవరిలోనే ఆయన పదవీ విరమణ చేశారు.