చంద్రబాబు బెయిల్ షరతులపై సీఐడీ పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

నవంబర్ 3కు తీర్పును వాయిదా వేసిన హైకోర్టు

ap high court
ap high court

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ షరతులపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. చంద్రబాబు బెయిల్ పై ఆంక్షలు విధించాలని కోర్టును సీఐడీ కోరింది. రాజకీయ కార్యకలాపాల్లో చంద్రబాబు పాల్గొనకుండా షరతులు విధించాలని విన్నవించింది. మీడియాతో మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేయకుండా ఆదేశించాలని కోరింది. కేవలం చికిత్స చేయించుకోవడానికి మాత్రమే ఆయనను పరిమితం చేయాలని విన్నవించింది. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు తరపు లాయర్లు ఈరోజు కౌంటర్ దాఖలు చేశారు. సీఐడీ కోరుతున్న షరతులు చంద్రబాబు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నవంబర్ 3న తీర్పును వెలువరిస్తామని తెలిపింది.