మహర్షి రాఘవను సత్కరించిన చిరంజీవి

మహర్షి రాఘవను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు మెగాస్టార్ చిరంజీవి. సినిమాల ద్వారా వినోదాన్ని పంచుతూ వస్తున్న చిరంజీవి..చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ వస్తున్నారు. 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్తనిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టారు. మెగా అభిమానులే కాదు సినీ ప్రముఖులు సైతం స్వచ్ఛందంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకు కు వచ్చి రక్తం ఇస్తుంటారు.

ఈ బ్లడ్ బ్యాంకుకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు. చిరంజీవి ఫై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీ మోహన్‌..రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావటం విశేషం. ఇప్పుడు మహర్షి రాఘవ 100వసారి రక్తదానం చేయటం గొప్పరికార్డు.100వ సారి రక్తదానం చేస్తున్నప్పుడు కచ్చితంగా నేను కూడా వస్తాను అని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు.

100వ సారి మహర్షి రాఘవ రక్తదానం చేసే సమయంలో చిరంజీవి చెన్నైలో ఉన్నారు.హైదరాబాద్ వచ్చిన ఆయన విషయం తెలుసుకుని మహర్షి రాఘవను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఘనం గా సత్కరించారు .ఆయనతో పాటు ఇదే సందర్భంలో మొదటిసారి రక్తదానం చేసిన మురళీ మోహన్‌ను కూడా కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరితో పాటు మహర్షి రాఘవ సతీమణి శిల్పా చక్రవర్తి కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.