సీతారామం ఫై మెగాస్టార్ ప్రశంసలు

సీతారామం చిత్రం ఫై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సీతారామం’. సుమంత్, డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్, తరుణ్‌ భాస్కర్‌, మురళి శర్మ, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. హను రాఘవపూడి డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో అశ్వినీదత్‌ నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఆగస్టు 5న తెలుగు తో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమాను చూసిన చిరంజీవి ట్విట్టర్ వేదికగా యూనిట్ ఫై ప్రశంసలు కురిపించారు. ‘సీతా రామం చూశాను. ఒక్క చక్కటి ప్రేమకావ్యం చూసిన అనుభూతి. ముఖ్యంగా ఎంతో విభిన్నమైన స్క్రీన్ ప్లేతో ప్రేమ కథని ఆవిష్కరించిన విధానం ఎంతోగానో నచ్చింది. మనస్సులపై చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వినీదత్, స్వప్నాదత్, ప్రియాంకా దత్ లకు… ఒక ఫ్యాషన్ తో చిత్రీకరించిన దర్శకుడు హనురాఘవపూడికి శుభాకాంక్షలు. అలాగే కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్ కి, అన్నిటికన్నా.. ముఖ్యంగా సీతా-రామ్ లుగా ప్రేమ కథకు ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ లకు సూత్రధారి పాత్రను పోషించిన రష్మిక మందన్నకి.. మొత్తం టీం అందరికీ నా శుభాకాంక్షలు’ అని తెలిపారు. ప్రేక్షకుల మనసులు దోచిన ఈ చిత్రం మరెన్నో అవార్డులను, రివార్డులను జాతీయస్థాయిలో గెలవాలని మనస్పూర్తిగా అభిలషిస్తున్నట్లు తెలిపారు.