సరిహద్దుకు దగ్గరగా చైనా యుద్ధవిమానాలు

రాడార్లను ఏమార్చగల జే20 ఫైటర్ జెట్స్

china-fighter-jets

న్యూఢిల్లీ: భారత్‌కు దగ్గరలోని వైమానిక స్థావరంలో చైనా అధునాతన స్టెల్త్‌ యుద్ధవిమానాలను రంగంలోకి దించింది. ఎల్ఏసీకి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటన్ ఎయిర్ ఫోర్స్ కేంద్రానికి ఇప్పటికే జే10, జే11 విమానాలను పంపిన చైనా, వాటికి తోడుగా జే20లను, జే8, జే16లను కూడా పంపింది.

ఒకవేళ ఇండియాతో యుద్ధం చేయాల్సి వస్తే, ముందుగా సైన్యాన్ని పంపకుండా, విమానాల ద్వారా క్షిపణులు, డ్రోన్లను వినియోగించాలని చైనా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎల్ఏసీ సమీపంలో బలగాలను పెంచుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జే20 ఫైటర్ జెట్ లను చైనాకే చెందిన చెంగ్డూ కంపెనీ తయారు చేసింది. ఇవి జే సీరీస్ లో ఫిఫ్త్ జనరేషన్ కు చెందినవి. మరో 20 ఏళ్ల పాటు ఇవి అన్ని రకాల యుద్ధాల్లోనూ చైనా సైన్యానికి వెన్నుదన్నుగా నిలుస్తాయని అంచనా. రాడార్లను ఏమార్చి మరీ దాడులు చేసే సామర్థ్యం వీటి సొంతం. వీటిల్లో రష్యాకు చెందిన ఏఎల్31 ఇంజన్ ఉంటుంది. ఈ తరహా విమానాలు చైనా వద్ద కనీసం 30 వరకూ ఉంటాయని అంచనా.

ఇదే సమయంలో ఇండియా కూడా సరిహద్దులకు మరిన్ని యుద్ధ విమానాలను పంపింది. లేహ్ వైమానిక స్థావరంలో సుఖోయ్30, మిగ్ 29కేలతో పాటు సీ17 రవాణా విమానాలు, నిఘా విమానమైన పీ8ఐ, అపాచీ, చినూక్ హెలికాప్టర్లతో పాటు డ్రోన్లను మోహరించింది. మొత్తం మీద రెండు దేశాలూ కలిపి దాదాపు లక్ష మంది సైనికులను సరిహద్దులకు తరలించడంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/