అమెరికాపై మరోసారి విరుచుకుపడ్డ చైనా
బీజింగ్: చైనా- అమెరికాపై మరోసారి విరుచుకుపడింది. టిబెట్ సమస్యలపై ఉన్నతాధికారిని నియమించడంపై మండిపడింది. టిబెట్ను అస్థిరపరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నదని చైనా ఆరోపించింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని గురువారం హెచ్చరించింది. టిబెట్ సమస్యలపై కొత్తగా నియమించిన ప్రత్యేక సమన్వయకర్త రాబర్ట్ డిస్ట్రో పేరును అమెరికా విదేశాంగ మంత్రి మైఖల్ పోంపియో బుధవారం ప్రకటించారు. టెబెట్ను అణగదొక్కేందుకు చైనా ప్రయత్నాలు, అధికార హోదా, మానవ హక్కుల ఉల్లంఘనలు, టిబెట్ మత స్వేచ్ఛ, సాంస్కృతిక, సంప్రదాయల పరిరక్షణపై అమెరికా ఆందోళనలు అలాగే ఉన్నాయని ఆయన అన్నారు.
మరోవైపు దీనిపై చైనా ఘాటుగా స్పందించింది. తమ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని సహించబోమని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జావో లిజియన్ అన్నారు. టిబెటన్ సమస్యల కోసం ప్రత్యేక సమన్వయకర్తను అమెరికా నియమించడం చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని చెప్పారు. టిబెట్ను అస్థిరపరిచే రాజకీయ కుట్ర అని వ్యాఖ్యానించారు. చైనా దీనిని వ్యతిరేకిస్తున్నదని, ఈ నియామకాన్ని తాము అంగీకరించబోమని లిజియన్ తెలిపారు. దీనిని ఎదుర్కొనే అన్ని చర్యలను చైనా తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/