అమెరికాలో మరోసారి కాల్పుల మోత
షికాగో పరేడ్పై దుండగుడి కాల్పులు..ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు
షికాగో ః మరోసారి అమెరికాలో కాల్పుల మోత మోగింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని షికాగో పట్టణంలో సోమవారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో కనీసం ఆరుగురు మరణించగా, దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. కచ్చితమైన మరణాల సంఖ్యను అధికారులు ధ్రువీకరించాల్సి ఉన్నది. హైల్యాండ్ పార్క్లో జూలై 4 పరేడ్ జరుగుతున్న సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది.
దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతికి చెక్ పెట్టేందుకు బైడెన్ సర్కార్ తగిన చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఈ ఘటన జరుగడం గమనార్హం. ఉదయం 10 గంటలకు పరేడ్ ప్రారంభమైంది. తుపాకీ శబ్ధంతో 10 నిమిషాల తర్వాత కార్యక్రమం నిలిచిపోయింది. దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పరేడ్కు వచ్చిన వందలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. 20-25 సార్లకు పైగా కాల్పుల శబ్ధాన్ని తాను విన్నానని మైల్స్ జెరెమ్స్కీ అనే ప్రత్యక్ష సాక్షి ఒకరు పేర్కొన్నారు. కాల్పులు చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/business/