నేడు ఆటో, ఊబర్ డ్రైవర్లతో సిఎం రేవంత్‌రెడ్డి భేటి

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 4 గంటలకు సమావేశం

CM Revanth Reddy meet with Auto and Uber drivers today

హైదరాబాద్‌ః ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా తమ బతుకుదెరువు దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారితో సమావేశం కానున్నారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆటో, ఊబర్ వాహనాల డ్రైవర్లతో సీఎం సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపైనా చర్చించనున్నారు.

కాగా, ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా తమ బతుకులు ఆగమ్యగోచరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేస్తూ గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో, ఊబర్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, బీఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ ఆటో వర్కర్స్ యూనియన్ వచ్చే రెండు రోజుల్లో నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నేడు సీఎం వారితో చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధిమార్గాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.