టీడీపీని జాకీలు పెట్టి పైకి లేపడానికి ట్రై చేస్తున్న.. జాకీలు విరిగిపోతున్నాయి – రోజా

టీడీపీని జాకీలు పెట్టి పైకి లేపడానికి ట్రై చేస్తున్నప్పటికీ జాకీలు విరిగిపోతున్నాయని ఎద్దేవా చేసారు ఏపీ పర్యటక శాఖ మంత్రి రోజా. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గుమ్ములూరు, బూరుగుపూడి గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె.. సుమారు రూ.80 లక్షలతో నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే), వైఎస్సార్‌ హెల్త్‌ సెంటర్‌తో పాటు, జగనన్న కాలనీ – పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మించిన ఇంటిని ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ..ప్రతి పేద కుటుంబానికీ సొంత కొడుకులా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమం అందజేస్తున్నారని అన్నారు. సచివాలయాలు, ఆర్‌బీకే, హెల్త్‌ సెంటర్ల వంటి వాటి ద్వారా పాలనను, ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు. రాజకీయాలకు, రికమండేషన్లకు తావు లేకుండా అర్హులందరికీ పథకాలు అందుతున్నాయన్నారు.

టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తామంటూ ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు, వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని మరో నాయకుడు మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహాన్ని భీమవరంలో ఏర్పాటు చేసి, ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ ప్రారంభించడం చరిత్రాత్మక ఘట్టమని చెప్పారు. ఇది చూసి భీమ్లానాయక్ బిగుసుకుపోయాడు అంటూ పవన్ కళ్యాణ్ ఫై సెటైర్లు వేసింది. జగన్ పై అక్కసుతో ఉన్న భీమ్లానాయక్ ప్రధాని మోడీతో, సీఎం జగన్ మోహన్ రెడ్డిని చూసి బిగుసుకుపోయాడని వ్యాఖ్యానించారు. అంతేకాదు చంద్రబాబు, లోకేష్ లు నీరుగారి పోయారని రోజా తనదైన శైలిలో పంచ్ లు వేసింది.