నేటి నుండి ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నేటి నుండి మూడు రోజుల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రోజురోజుకు మరింత వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో నేతలు తమ పర్యటనలతో బిజీ అవుతున్నారు. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పార్టీ అధినేత చంద్రబాబు సైతం పలు జిల్లాలో పర్యటిస్తూ కార్యకర్తలతో ముఖాముఖీ అవుతున్నారు.

తాజాగా ఈరోజు నుండి మూడు రోజుల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు. మచిలీపట్నం, గుడివాడ, నూజివీడులో జరిగే రోడ్‌షో కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం జిల్లాలోని నిమ్మకూరులో జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో కూడా చంద్రబాబు పాల్గొంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి.