తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రథమ భారతీయ భాషా శాస్త్రవేత్త, తెలుగు వెలుగు గిడుగు వేంకట రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ… ప్రపంచ వ్యాప్త తెలుగువారందరికీ శుభాకాంక్షలు అని తెలిపారు. తెలుగు వ్యవహారిక భాషలోనే పుస్తక రచన చేయాలని ఉద్యమించి, సాహిత్యాన్ని సామాన్యుడికి చేరువచేసిన గిడుగు రామ్మూర్తి స్మృతికి నివాళులర్పిస్తున్నానన్నారు.

విద్యావ్యాప్తి జరగాలంటే బోధన జరిగే భాష మాతృభాషే అయివుండాలని ఆయన ఆశించారు. గిడుగు వారి ఆశయ స్ఫూర్తిగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం దగ్గర నుంచి పాలనలో తెలుగును ప్రవేశపెట్టడం వరకు తెలుగు భాష వ్యాప్తికి, సంరక్షణకు నడుం కట్టింది తెలుగుదేశమే అని చెప్పుకొచ్చారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పాటుపడాలని కోరుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.