రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైస్సార్సీపీ నేతలు మృతి

వైస్సార్సీపీ పార్టీ లో మరోసారి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు వైస్సార్సీపీ నేతలు మృతి చెందారు. రాయదుర్గం వైస్ ఎంపీపీ సత్యనారాయణ నాయుడు.. వైఎస్సార్‌సీపీ నేత మంజునాథ్ లు బైక్ ఫై వెళ్తుండగా.. రాయదుర్గం మండలం దేవరెడ్డిపల్లి దగ్గర వారి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మరణించారు. ఈ విషయం తెలియడంతో ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. రోడ్డు ప్రమాదం లో మరణించిన ఇద్దరు వైస్సార్సీపీ నేతల మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతం అయ్యారు.

మూడు నెలల క్రితం కాపు రామచంద్రారెడ్డి అల్లుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. కొన్ని కారణాలతో రామచంద్రారెడ్డి ఇటీవల అనంతపురం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తమ కుటుంబంలో జరిగిన విషాదం వల్ల జిల్లా స్థాయి కార్యక్రమాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతున్నట్లు అధినేత జగన్‌కు రాసిన లేఖలో ప్రస్తావించారు. అందుకే పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఇకపై సొంత నియోజకవర్గం రాయదుర్గంపై ఫోకస్ పెడతానన్నారు.