28న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు
ఓట్ల తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు
అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 28న ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఓట్ల తొలగింపులో ఉరవకొండ తరహా ఘటనలు ఉన్నాయని ఆయన సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వైఎస్ఆర్సిపి సానుభూతిపరులకు సంబంధించిన దొంగ ఓట్లను చేర్చడం, టిడిపి అనుకూల ఓట్లను తొలగించడం తదితర అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు.
వాలంటీర్లతో టిడిపి, వైఎస్ఆర్సిపి అనుకూల ఓట్ల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోందని.. తద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈసీకి చంద్రబాబు తెలియజేయనున్నారు. ఓట్ల అక్రమాలపై ఉరవకొండ, పర్చూరు, విజయవాడ, విశాఖ తదితర ఘటలకు సంబంధించిన సాక్ష్యాలను అందజేయనున్నారు. ఇదే సమయంలో టిడిపి నేతల ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదని కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు. అక్రమాలు నివారించాలని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా ఉరవకొండ తరహా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు.