రాష్ట్రపతి ముర్ముకు ధన్యవాదాలు తెలిపిన : చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లకు ఇది ఎనలేని గర్వకారణం.. చంద్రబాబు

chandrababu-thanked-president-murmu

న్యూఢిల్లీః ఢిల్లీలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చిత్రంతో కూడిన ఈ రూ.100 నాణెం ఆవిష్కరణకు టిడిపి అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. దీనిపై చంద్రబాబు ‘ఎక్స్’ లో స్పందించారు. “ఎన్టీఆర్ గౌరవార్థం ఆయన బొమ్మతో కూడిన ప్రత్యేక నాణేన్ని విడుదల చేసినందుకు గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి హృదయకపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, రాజకీయాలకు అతీతంగా, హద్దులను చెరిపివేస్తూ, ఎన్టీఆర్ ఘనతర వారసత్వాన్ని స్మరించుకుంటూ, నేడు ఐక్యంగా నిలిచిన ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజలందరికీ ఈ ఘట్టం ఎనలేని గర్వకారణం” అని చంద్రబాబు వివరించారు.