‘క్విట్ జగన్.. సేవ్ ఏపీ’ నినాదంతో ముందుకెళ్లాలని చంద్రబాబు పిలుపు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం నూజీవీడు లో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ..‘క్విట్ జగన్.. సేవ్ ఏపీ’ నినాదంతో ముందుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ అనే సైతాను ఉన్నంత వరకు ఏపీలో అభివృద్ధి జరగదన్నారు. తాను తీసుకొచ్చిన మల్లవల్లి పారిశ్రామికవాడను పూర్తి చేసి ఉంటే 50 వేల ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఒక్క అవకాశానికి మోసపోయిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైస్సార్సీపీ నేతలు దొంగల ముఠాల్లా మారి ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు.

భోగాపురం విమానాశ్రయం, కడప స్టీల్‌ప్లాంట్‌కు తాము అప్పుడే భూమిపూజ చేశామని, ఈ ప్రభుత్వం వాటికి మళ్లీ చేస్తోందన్నారు. పోలీసులు త్యాగానికి మారుపేరని, కానీ కొందరి తీరువల్ల వారి ప్రతిష్ఠ మసకబారుతోందని చంద్రబాబు అన్నారు. పోలీసులు ఇప్పుడు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా తిరుపతి పింక్ డైమండ్‌ను తానే కాజేశానని అన్నారని, అధికారంలోకి వచ్చాక అసలు పింక్ డైమండ్ అనేదే లేదని అంటున్నారని చంద్రబాబు అన్నారు.