హైదరాబాద్‌లో బిజెపి నేత తిరుపతిరెడ్డి కిడ్నాప్!

భూమి విషయంలో ప్రత్యర్థులతో వివాదం ఉందన్న భార్య సుజాత

bjp-leader-tirupati-reddy-kidnapped-in-hyderabad

హైదరాబాద్‌ః తెలంగాణ బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు, రియలెస్టేట్ వ్యాపారి తిరుపతి రెడ్డి కిడ్నాప్ కు గురయ్యారు. హైదరాబాద్ లోని ఆల్వాల్ లో ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తన భర్త కిడ్నాప్ కు గురయినట్టు ఆయన భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి రెడ్డిది జనగామ జిల్లా దుబ్బకుంటపల్లి. హైదరాబాద్ లోని కుషాయిగూడలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు.

5,929 గజాల భూమి విషయంతో ప్రత్యర్థులతో ఆయనకు వివాదం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుజాత పేర్కొన్నారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆల్వాల్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఆయనను కిడ్నాప్ చేశారని తెలిపారు. తహసీల్దార్ కార్యలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన ఫోన్ పని చేయడం లేదని చెప్పారు. ప్రత్యర్థులే ఆయనను కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. బిజెపిలో యాక్టివ్ రోల్ పోషిస్తున్న తిరుపతి రెడ్డి… జనగామ టికెట్ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.