చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి అత్యంత విషాదకరం: చంద్రబాబు

తగిన రక్షణ చర్యలతో భక్తుల భయాన్ని తొలగించాలని సూచన

chandrababu-responded-death-of-a-six-year-old-girl-in-a-leopard-attack-in-tirumala

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు తిరుమల అలిపిరి మార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై స్పందించారు. చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి అత్యంత విషాదకరమని అన్నారు. పాప తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

‘‘కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమల కొండకు కాలినడకన వెళ్తున్న ఆరేళ్ల చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడం అత్యంత విషాదకరం. కళ్లముందే క్రూర జంతువు కూతురిని లాక్కెళ్లిపోతే ఆ బాధ వర్ణనాతీతం. పాప తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా” అని పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం చిరుత దాడిలో బాలుడు గాయపడ్డ ఘటన జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పుడే టీటీడీ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం తప్పేదని అన్నారు. అధికారులు సమర్థ ప్రణాళికతో వ్యవహరించాలని, తగిన రక్షణ చర్యలతో భక్తుల భయాన్ని తొలగించాలని సూచించారు.