స్వామి పై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాః చంద్రబాబు

chandrababu

అమరావతిః ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో నేడు చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలపై టిడిపి అధినేత చంద్రబాబు స్పందించారు. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిపై వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. నాడు అసెంబ్లీలోనూ బాలవీరాంజనేయస్వామిపై దాడి చేశారని, ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేశారని… ఇదంతా దళిత నాయకుడైన స్వామి గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చంద్రబాబు మండిపడ్డారు.

తమ పట్ల వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అనుసరిస్తున్న అహంకార ధోరణిని దళిత సమాజం గమనిస్తోంది… మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధం అయింది అని హెచ్చరించారు. “నా సోదరుడు స్వామి మీ అక్రమ అరెస్టులకు, వేధింపులకు భయపడే నేత కాదు. ఎదిరించి పోరాడే నాయకుడు. పోలీసులు వైఎస్‌ఆర్‌సిపి క్రియాశీల కార్యకర్తల్లా కాకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలి. వెంటనే స్వామిని విడుదల చేయాలి” అని చంద్రబాబు డిమాండ్ చేశారు.