ఈ నెల 24 నుంచి కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

chandrababu kuppam tour fix

టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 24 నుండి కుప్పంలో పర్యటించబోతున్నారు. మూడు రోజుల పాటు కుప్పంలో బాబు పర్యటన కొనసాగనుంది. తొలి రోజు రామకుప్పం మండలంలో పర్యటించనున్నారు. రెండవ రోజు పూర్తిగా కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. మూడవ రోజు కుప్పం, గుడుపల్లె మండలాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.

ఈ ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా నియోజ‌క‌వ‌ర్గంలోని పలువురు నేత‌ల‌తో ఆయన స‌మావేశం కానున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా పార్టీ శ్రేణుల‌కు ఆయ‌న ప‌లు కీల‌క సూచ‌న‌లు చేయ‌నున్నారు. ప్రతి ఇన్‌చార్జ్‌ నియోజకవర్గంలో కనీసం 10 నుంచి 15 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచించారు. అబ్జర్వర్‌‌గా ఉన్న నేతలు సైతం నెలలో కనీసం 8 రోజులు ఆ నియోజకవర్గంలో పర్యటించాలని సూచించారు.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే రాజకీయ వేడి మొదలైంది. వరుస పెట్టి నేతలు పర్యటనలు చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా వైస్సార్సీపీ ని ఓడించాలని టీడీపీ-జనసేన పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. మరోపక్క అక్టోబర్ 05 నుండి పవన్ కళ్యాణ్ సైతం రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర చేపట్టబోతున్నారు. అలాగే టీడీపీ – జనసేన లోకి వైస్సార్సీపీ నేతలు చేరడం మొదలుపెట్టారు. ఎన్నికల సమయానికి మరింత మంది చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.