ఎన్నికల తర్వాత టిడిపి అడ్రస్ గల్లంతుః విడదల రజని
చంద్రబాబు జోక్ లకు ప్రజలు నవ్వుకుంటున్నారు..విడదల రజని
అమరావతిః ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వేస్తున్న జోక్ లకు ప్రజలు విరగబడి నవ్వుతున్నారని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టిడిపి, చంద్రబాబు అండ్ కో అడ్రస్ గల్లంతవుతుందని… ఈ విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా అర్థమయిందని… అందుకే తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ తో కలిసి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
గత నాలుగేళ్లుగా సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. వారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయామనే అక్కసుతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై టిడిపి శ్రేణులు బురద చల్లుతున్నాయని అన్నారు.
టిడిపి నేతల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రజిని వ్యాఖ్యానించారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి శూన్యమని… జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రం అన్ని విధాలుగా పురోగమిస్తోందని చెప్పారు. 11 మంది బీసీలను మంత్రులుగా చేసిన ఘనత జగన్ దేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 2019 కంటే ఘోరంగా టిడిపి ఓడిపోతుందని జోస్యం చెప్పారు.