నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్

వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరయ్యే అవకాశం

chandrababu-judicial-remand-to-end-today-may-appear-before-court-virtually

అమరావతిః స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు రెండోసారి విధించిన జ్యుడీషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. దీంతో, ఆయన మరోమారు విజయవాడ ఏసీబీ కోర్టు ముందు వర్చువల్‌గా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంలో తమకు ఇంకా ఎటువంటి ఆదేశాలు అందలేదని జైలు పర్యవేక్షణాధికారి రాహుల్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందితే ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

తొలి రిమాండ్ ముగిశాక చంద్రబాబు కోర్టు ఎదుట వర్చువల్‌గానే హాజరయ్యారు. అప్పట్లో కోర్టు సీఐడీ కస్టడీకి అనుమతించడంతో అధికారులు జైల్లోనే చంద్రబాబును రెండు రోజుల పాటు విచారించారు. ఆ తరువాత కూడా వర్చువల్ విధానంలోనే టిడిపి అధినేత న్యాయమూర్తి ముందు హాజరుకాగా జడ్జి ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌ను అక్టోబర్ 5 వరకూ పొడిగించారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే.