బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు – జగన్

విజ‌య‌వాడ జ‌య‌హో బీసీ స‌భ‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డి..టీడీపీ అధినేత చంద్రబాబు ఫై నిప్పులు చెరిగారు. బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని , బీసీలంటే ఇస్త్రీ పెట్టలు, కుట్టు మిషన్లు, పనిముట్లు కాదని చంద్రబాబుకు చెప్పాలన్నారు. 2014లో బీసీలకు ఏకంగా చంద్రబాబు 114 వాగ్థానాలు ఇచ్చి అందులో పదిశాతం కూడా అమలు చేయని ఆయనకు చెప్పాలన్నారు. తాము ఇప్పుడు వెన్నెముక కులాలుగా మారామని చెప్పాలన్నారు. రాజ్యాధికారంలో భాగస్వామ్యం.. ఇప్పుడున్న ప్రభుత్వం మాది, మనది అని చెప్పాలన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణమాఫీ దగాను గుర్తు చేయాలన్నారు. గతంలో ఇలా ఇచ్చిన హామీలను గుర్తు చేయాలన్నారు. బీసీలను చంద్రబాబు చేసిన మోసాన్ని గుర్తు చేయాలని పిలుపునిచ్చారు.

బీసీ సోదరులు, అక్కాచెల్లెళ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ జయహో బీసీ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం మొదలుపెట్టారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు.. బ్యాక్ బోన్ క్లాసులని స్పష్టం చేశారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందని జగన్ చెప్పారు. ‘మీ హృదయంలో జగన్.. జగన్ హృదయంలో మీరు ఎప్పటికీ ఉంటారు’ అని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

బీసీల గురించి శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో చెప్పినట్లు.. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి మగ్గం, శాలెల మగ్గం.. గొడ్డలి రంపం, కొడవలి నాగలి.. ఇలా మన సమస్త గ్రామీణ వృత్తుల సంగమమే బీసీలు అని సీఎం జగన్ కొనియాడారు. రాజ్యాధికారంలో మేం కూడా భాగమేనని చంద్రబాబుకు చెప్పాలని బీసీలకు జగన్ సూచించారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మాది.. మా అందరిదీ అని గట్టిగా నినదించండంటూ ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు.