చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ తిరస్కరణ
సీఐడీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి
విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన టిడిపి అధినేత చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. జైల్లో ఆయనకు ముప్పుపొంచి ఉన్న నేపథ్యంలో హౌస్ కస్టడీకి అనుమతివ్వాలంటూ ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా దాఖలు చేసిన పిటిషన్పై వరుసగా రెండోరోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం హౌస్ కస్టడీకి అనుమతి ఇవ్వలేదు.
కాగా, చంద్రబాబు భద్రతకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక బ్యారక్ ఇచ్చామని కోర్టుకు సీఐడీ తెలిపింది. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిన్న సుదీర్ఘ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును నేటికి వాయిదా వేశారు. ఈ రోజు చంద్రబాబు పిటిషన్ను తిరస్కరిస్తూ తీర్పు చెప్పారు. పిటిషన్ తిరస్కరణ నేపథ్యంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.