చంద్రబాబు టికెట్లు ఇచ్చిన అందరూ గెలిచారా?: బొత్స సత్యనారాయణ

ఇది అన్ని పార్టీల్లో జరిగే ప్రక్రియే అన్న బొత్స

botsa satyanarayana
botsa satyanarayana

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపిలో నియోజకర్గాల ఇన్ఛార్జీల మార్పులపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్‌ఆర్‌సిపి ఓడిపోబోతోందనే భయాల కారణంగానే ఇన్ఛార్జీలను మారుస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… టిడిపి కి కౌంటర్ ఇచ్చారు. మార్పులు అనేవి ప్రతి పార్టీలో జరిగే ప్రక్రియేనని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు సీట్లు ఇచ్చిన అందరూ గెలిచారా? అని ప్రశ్నించారు. మార్పులు, చేర్పులు అన్ని పార్టీల్లో ఉంటాయని… అదే ప్రక్రియ తమ పార్టీలో కూడా జరిగిందని చెప్పారు.

కుప్పంలో గెలుస్తాననే నమ్మకం చంద్రబాబుకు లేదని… అందుకే రెండు చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారని బొత్స ఎద్దేవా చేశారు. విడతల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్… అదే చేస్తున్నారని చెప్పారు. సామాన్యులకు మందు దొరకకుండా చేస్తున్నామని తెలిపారు. మద్యం విషయంలో ప్రజల్లో పరివర్తన తెస్తున్నామని తెలిపారు. అంగన్వాడీలు ఆందోళన విరమించాలని సూచించారు.

తుపాను కారణంగా జరిగిన పంట నష్టంపై చంద్రబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు. వర్షం తగ్గాక పంట నష్టంపై అంచనా వేస్తారని తెలిపారు. రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనాలని ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు. ప్రజలకు అండగా ఉన్నది వైసీపీ అని… వచ్చే ఎన్నికల్లో టిడిపి తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు.