పంట నష్టపోయిన రైతులకు అండగా నిలవడంలో జగన్ విఫలమయ్యారుః చంద్రబాబు

వర్షాలకు తడిసి, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్

chandrababu

అమరావతిః ఐదేళ్ల కిందట ప్రారంభోత్సవం జరిగిన భోగాపురం ఎయిర్ పోర్టును సీఎం జగన్ తన సొంత ప్రచారం కోసం తిరిగి ప్రారంభించారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ఫుల్ పేజీ యాడ్స్ కు ప్రభుత్వ ధనం భారీగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఇవ్వాల్సిన అవసరం లేకున్నా కేవలం కమీషన్ల కోసం హిందూజాలకు, అమూల్‌కు వేలకోట్ల ప్రభుత్వ ధనం ధారాదత్తం చేశారని ఆరోపించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు అండగా నిలవడంలో జగన్ విఫలమయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలకు అండగా నిలవాలని టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. వర్షాలపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో, ఏర్పాట్లు చేయకపోవడంతో ఎక్కువగా పంట నష్టం జరిగిందన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం రైతులను పరామర్శించడం లేదని చంద్రబాబు విమర్శించారు. ‘‘నష్టపోయిన వరి, మొక్కజొన్న రైతుకు ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి. మిర్చి, అరటి, మామిడి రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలి’’ అని డిమాండ్ చేశారు. పిడుగుపాటుకు గురై మరణించిన వ్యక్తి కుటుంబానికి 10 లక్షల పరిహారం అందించాలన్నారు. వర్షాలకు తడిసి రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని చెప్పారు. తరుగు పేరుతో రైతుల్ని దోచుకోవడం అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.