పక్కా ప్రణాళికతో గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపండిః చంద్రబాబు

గంజాయి వాడవాడలా విస్తరిస్తోందని వ్యాఖ్య

chandrababu

అమరావతిః గంజాయి కారణంగా విజయవాడలో జరిగిన గొడవలో అజయ్ సాయ్ అనే యువకుడు మరణించడంపై టిడిపి అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. వాడవాడలా విస్తరిస్తున్న గంజాయి పీడపై ఏపీ ప్రభుత్వం ఉదాసీన వైఖరి ఎందుకు అవలంబిస్తోందని ప్రశ్నించారు.

‘‘ఏపీలో విచ్చలవిడి గంజాయి వినియోగం యువత భవిష్యత్తుని నాశనం చేయడమే కాదు, ఏకంగా ప్రాణాలను కూడా తీస్తోంది. విజయవాడ సమీపంలో గంజాయి మత్తులో జరిగిన చిన్న గొడవ ఏకంగా అజయ్ సాయి అనే యువకుడి ప్రాణాలు తీసింది. మరో ఐదుగురిని హంతకులను చేసింది. దీనికి ఈ ప్రభుత్వ సమాధానం ఏంటి? వాడవాడలా విస్తరిస్తున్న గంజాయిపై ఇంత ఉదాసీనత ఎందుకు? ఒకసారి గంజాయికి అలవాటు పడిన వారి జీవితం ఎంత ప్రమాదంలోకి వెళ్తుందో అధికారులు అర్థం చేసుకోరా? ఈ ఉదాసీనత వల్ల గంజాయి మహమ్మారి మన బిడ్డల వరకు వస్తుంది అని మర్చిపోకండి. పక్కా ప్రణాళికతో గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపండి’’ అని ట్వీట్ చేశారు.