ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.15 శాతం ..ఉత్తర్వులు జారీ

0.05 శాతం పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఓకే

centre-clears-815-percent-interest-rate-on-employees-provident-fund-for-202223

న్యూఢిల్లీః 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయిసీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.15 శాతానికి ప్రభుత్వం ఆమోదించింది. ఈపీఎఫ్ ఖాతాల్లో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటును సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ నిర్ణయం తీసుకోగా, కేంద్రం ఆమోదం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 0.05 శాతం అధికం. రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌ఓ మార్చి 28, 2023న డిపాజిట్లపై వడ్డీ రేటును 8.15 శాతనికి పెంచింది.

ఈ నిర్ణయాన్ని సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ.. కేంద్ర ఆర్థిక శాఖకు పంపించి, ఆమోదం లభించడంతో సోమవారం ప్రకటన జారీ చేసింది. దీంతో ఆరుకోట్ల మంది ఈపీఎఫ్ మెంబర్లకు ప్రయోజనం చేకూరుతుంది. సోమవారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం… ఈపీఎఫ్ఓ త్వరలో 2022-23 వడ్డీ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమ చేయనుంది.

ఈపీఎఫ్ఓ ఫీల్డ్ కార్యాలయాలు 8.15 శాతం చొప్పున వడ్డీని చందాదారుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభిస్తాయి. మార్చి 2022లో ఈపీఎఫ్ఓ 2021-22 వడ్డీ రేటును 8.5 శాతం నుండి నాలుగు దశాబ్దాల కనిష్టం 8.10 శాతానికి తగ్గించింది.ఈపీఎఫఓ వడ్డీ రేటు 1977-78లో 8 శాతంగా ఉంది. ఆ తర్వాత 2021-22 వడ్డీ రేటు కనిష్టం. గత ఆర్థిక సంవత్సరానికి మాత్రం 0.05 శాతం పెంచింది.