ఏపీ, తెలంగాణ విభజన సమస్యలపై స‌మావేశానికి కేంద్ర హోం శాఖ పిలుపు

ఏ అంశాల‌ను చ‌ర్చించాల‌న్న దానిపై అధికారుల‌కు కేంద్ర హోం శాఖ స‌మాచారం
ఈ నెల 17న ఉదయం 11 గంటల‌కు కమిటీ తొలి భేటీ

న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం ఏర్పాటు చేయాల‌ని కీల‌క నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి నేతృత్వంలోని క‌మిటీ ఈ స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. ఈ నెల 17న ఉదయం 11 గంటల‌కు కమిటీ తొలి భేటీ నిర్వహిస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై ప్రధానంగా చర్చలు జ‌రుగుతాయి. ఏయే అంశాలు చర్చించాలన్న విష‌యంపై అధికారులకు కేంద్ర హోంశాఖ ఇప్ప‌టికే సమాచారం అందించింది. షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలపై చర్చ జ‌రుపుతామ‌ని తెలిపింది. అలాగే, ఆర్థికపరమైన అంశాలపై చర్చ జ‌ర‌గ‌నుంది.

కాగా, విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఈ నెల 8న జరిగిన సమావేశంలో కేంద్ర హోం శాఖ క‌మిటీ ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి ఎస్‌ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఉన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/