ఖైరతాబాద్‌ గణేశుడికి తొలిపూజ చేసిన గవర్నర్ తమిళసై

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసారు గవర్నర్ తమిళసై. ఉదయం నుండే దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. ప్రతి చోటా విగ్రహ ప్రతిష్ఠాపన, ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భక్తులంతా భక్తిలో మునిగిపోయారు. ఇక హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్‌ గణేశుడు పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనమిస్తున్నారు. లంబోధరుడిని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దర్శించుకున్నారు. గణనాథుని తొలి పూజలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. అందరిని ఐకమత్యంగా ఉంచేదే గణేష్ ఉత్సవాలు అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

వీరితో పాటు మహాగణనాథుడికి మంత్రి తలసాని, ఎమ్యెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పాల్గొని వినాయకుడికి మహా హారతి ఇచ్చారు. వీరితో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం బడా గణేశ్ ని సందర్శించారు. అంతకుముందు ఈ ఖైరతాబాద్ వినాయకుడికి భారీ లడ్డును నిర్వాహకులు సమర్పించారు. ఈ సారి 50 అడుగుల ఎత్తులో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి వినాయకుడికి మొదటగా పద్మశాలి సంగం తరపున పట్టు వస్త్రాలు, గరికపూస, వెండి జంజాన్ని నిర్వాహకులు సమర్పించారు.