రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ ఇంట్లో ఈడీ సోదాలు
జైపూర్: రాజస్థాన్లో ఈరోజు ఈడీ పలు ప్రదేశాల్లో సోదాలు చేస్తోంది. ప్రభుత్వ స్కూల్ టీచర్ల రిక్రూట్మెంట్ పరీక్షా పేపర్ల లీకేజీ కేసుతో లింకున్న వారి ఇండ్లల్లో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ గోవింద్ సింగ్ దోతసారా ఇంట్లో కూడా ఈడీ సోదాలు చేస్తోంది. మరో ఆరు ప్రదేశాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు రాజస్థాన్ ఒకవైపు రెఢీ అవుతుండగా.. అకస్మాత్తుగా ఈడీ తన జోరు పెంచింది. కాంగ్రెస్ నేతల ఇండ్లపై తనిఖీలు చేస్తోంది.
గత వారం ఈడీ నిర్వహించిన సోదాల్లో 12 లక్షల నగదు లభ్యమైంది. ఏడు చోట్ల నిర్వహించిన తనిఖీల్లో పలు కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత దినేశ్ ఖోదనియా ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేపట్టారు. ప్రభుత్వ స్కూల్ టీచర్ల పరీక్ష పేపర్ లీకేజీపై నమోదు అయిన కేసులు ఆధారంగా ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. పరీక్ష రాసిన అభ్యర్థులకు పేపర్ను పది లక్షలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.