మరో వివాదంలో చిక్కుకున్న కర్ణాటక మంత్రి

నోట్లను వెదజల్లుతూ వేడుకలు చేయడంతో వివాదం

Cash shower ..Karnataka Congress Minister goes viral

న్యూఢిల్లీః కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి పాల్గొన్న వివాహ వేడుకలో కరెన్సీ నోట్లను వినోదానికి ఉపయోగించినట్టు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో అది వివాదంగా మారింది. శివానంద పాటిల్ కర్ణాటక రాష్ట్ర చెరకు సాగు అభివృద్ధి మంత్రిగా ఉన్నారు. గుల్బర్గా కాంగ్రెస్ నేత అయాజ్ ఖాన్ కుమారుడికి, హైదరాబాద్ కు చెందిన వ్యాపారి, రెడ్ రోజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సయ్యద్ హమీద్ ఉద్దీన్ కుమార్తెతో వివాహం జరిగింది. ఈ వివాహ వేడుక హైదరాబాద్ లో జరిగింది.

ఈ వివాహ వేడుకకు శివానంద పాటిల్ తో పాటు మరికొందరు కర్ణాటక మంత్రులు కూడా హాజరయ్యారు. సోఫాలో పాటిల్ కూర్చోగా, ఆయన చుట్టూ కరెన్సీ నోట్లు, పాదాల వద్ద కూడా ఉండడాన్ని గమనించొచ్చు. ఆయన ముందు కొందరు యువత గాల్లోకి రూ.500 నోట్లు వెదజల్లుతూ పెళ్లిలో సంబరాలు చేసుకున్నారు. పెళ్లి మండపం అంతా నోట్లతో నిండిపోయింది. దీనిపై బిజెపి, బిఆర్ఎస్ విమర్శలు చేశాయి.

‘‘ప్రజల నుంచి దోచుకున్న డబ్బును మంత్రులు ఎలా ఆనందిస్తున్నారో చెరకు మంత్రి శివానంద పాటిల్ చక్కగా చూపించారు’’ అంటూ కర్ణాటక బిజెపి తన ట్విట్టర్ హ్యాండిల్ పై పోస్ట్ చేసింది. దీనిపై మంత్రి శివాదంద పాటిల్ స్పందించారు. తానేమీ నోట్లను వెదజల్లలేదంటూ, పెళ్లి కార్యక్రమంలో అది చోటు చేసుకున్నట్టు చెప్పారు. పాటిల్ గత నెలలోనూ తన వ్యాఖ్యలతో వివాదం కొనితెచ్చుకున్నారు. మెరుగైన పరిహారం వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగినట్టు వ్యాఖ్యానించారు.