అమెరికాలో మరోసారి పేలిన గన్..ముగ్గురు మృతి

అమెరికా లో గన్ కల్చర్ రోజు రోజుకు పెరిగిపోతుంది. యువకుల దగ్గరి నుండి పెద్దవారి వరకు చాలామంది గన్ కల్చర్ కు అలవాటుపడి , అమాయకులను పొట్టనపెట్టుకుంటున్నారు. ప్రతి వారం లో ఒకటి , రెండు చోట్ల ఈ కాల్పుల మోత మోగుతూనే ఉంది. మొన్నటికి మొన్న టెక్సాస్‌లోని ఓ ఎలిమెంటరీ స్కూల్ లో 18 ఏళ్ల యువకుడు తుపాకీ తో 18 మందిని చంపగా, ఆ తరువాత ఓక్లహోమాలో జరిగిన వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో మహిళ మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు.

ఇక ఇప్పుడు మేరీల్యాండ్‌లోని స్మిత్స్‌బర్గ్‌లో కొలంబియా మెషీన్ అనే మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిన్న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు వాషింగ్టన్ సిటీ పోలీసులు తెలిపారు. బాధితులు కంపెనీ ఉద్యోగులా? కాదా? అన్న విషయంలో స్పష్టత లేదని పేర్కొన్నారు. కాల్పుల తర్వాత అక్కడి నుంచి పరారైన నిందితుడిని ఘటనా స్థలానికి కొద్ది దూరంలో మేరీల్యాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.