కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి సూచన
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/05/CM-Revanth-Reddy-review-meeting-on-state-emblem-and-anthem-today.jpg)
హైదరాబాద్ః రేపు లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థులు, ఇంఛార్జులు, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాతే ఈవీఎంల లెక్కింపు అవుతుందని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్న వారిని మాత్రమే ఏజెంట్లుగా పంపించాలని… సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకువెళ్లేలా చూడాలన్నారు.
కౌంటింగ్ సమయంలో ప్రతి రౌండ్లోనూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరి దగ్గర 17సీ లిస్ట్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. అభ్యర్థులందరికీ వీటన్నింటిపై అవగాహన ఉండాలన్నారు.