భారత్, కెనడా ఉద్రిక్తతల వేళ..దీపావళి వేడుకల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో
హ్యాపీ దివాలీ.. హ్యాపీ బండి చోర్ దివస్ అంటూ విషెస్
ఒట్టావాః భారత్తో ఉద్రిక్తతలకు కారణమైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఒట్టావాలో ఈ నెల 7న భారతీయ సమాజం నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. పార్లమెంట్ హిల్లో జరిగిన ఈ వేడుకల అనంతరం ప్రధాని తన ఫొటోలను ఎక్స్లో షేర్ చేస్తూ.. ఈ వారంలో ప్రజలు దీపావళి, బండి చోర్ దివస్ జరుపుకుంటారని, ఇవి రెండు మనకు మరిన్ని వెలుగులు ప్రసాదిస్తాయని, ఈ వేడుకలు మీలో ఆశావాహ దృక్పథాన్ని నింపుతాయని పేర్కొన్నారు. హ్యాపీ దివాలీ.. హ్యాపీ బండి చోర్ దివస్’ అని రాసుకొచ్చారు.
ఇండో-కెనడియన్ పార్లమెంటేరియన్ చంద్రశేఖర్ ఆర్య ఆధ్వర్యంలో పార్లమెంట్ హిల్లో దీపావళి వేడుకలు జరిగాయి. ఒట్టావా, గ్రేటర్ టొరొంటో, మాంట్రియల్ వంటి నగరాల నుంచి ఈ వేడులకు పెద్ద ఎత్తున భారతీయులు హాజరయ్యారు. కర్ణాటకకు చెందిన ఆర్య ఈ ఫొటోలను ఎక్స్లో షేర్ చేస్తూ పార్లమెంటు హిల్లో దీపావళి వేడుకలకు నిర్వహించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.