ఈ నెల 15 న హుస్నాబాద్‌ లో కేసీఆర్ భారీ సభ..

తెలంగాణ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో అధికార పార్టీ బిఆర్ఎస్ ప్రచారం కార్యక్రమాలతో బిజీ కాబోతుంది. ముఖ్యంగా గులాబీ బాస్ కేసీఆర్..గత కొద్దీ రోజులుగా అనారోగ్యం కారణంగా ప్రగతిభవన్ కే పరిమితమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో ఎన్నికల ప్రచారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ నెల 15 న హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల శంఖారావం పూరించేందుకు గులాబీ బాస్ సిద్ధ‌మ‌య్యారు.

ఈ నెల 15న బిఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో అభ్యర్థులకు బీ ఫారాలను అందజేయనున్నారు. అనంతరం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు ఈ సభలో బిఆర్ఎస్ మేనిఫెస్టో ను ప్రకటించనున్నారు. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే బహిరంగ సభలకు హాజరవుతారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే సభలకు హాజరవుతారు. 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే మీటింగ్‌లో, సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌లో జరిగే సభకు హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.