రైతుబంధు పంపిణీకి అనుమతి.. ఈసీకి బిఆర్ఎస్ మరోసారి విజ్ఞప్తి

Central Election Commission

హైదరాబాద్‌ః రైతుబంధు పంపిణీకి అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘానికి బిఆర్ఎస్ మరోసారి విజ్ఞప్తి చేసింది. తొలుత రైతుబంధు పంపిణీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే బిఆర్ఎస్ నేత హరీశ్ రావు వ్యాఖ్యల నేపథ్యంలో రైతుబంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఎన్నికల సంఘం వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ మరోసారి ఈసీని ఆశ్రయించింది. అనుమతిని నిరాకరిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది.

ఈ నెల 28వ తేదీలోపు రైతుబంధు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో రైతుబంధు గురించి ఎక్కడా ప్రస్తావించరాదని ఈసీ షరతులు విధించింది. ఈ పథకం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందే వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది. అయితే రైతుబంధుపై మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు చేయడంతో ఈసీ అనుమతిని నిరాకరించింది. దీంతో బిఆర్ఎస్ ఈసీ వద్దకు మరోసారి వెళ్లింది.