షాద్నగర్ పరిధిలో రంగుల తయారీ పరిశ్రమలో భారీ పేలుడు..
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని ఓ రంగుల తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. దీంతో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. షాద్నగర్ సమీపంలోని శ్రీనాథ్ రోటో ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైపర్స్, పెయింట్స్ తయారీతోపాటు పలు రకాల విభాగాలు ఉన్నాయి. అయితే ఆదివారం రాత్రి పెయింట్ విభాగంలో రంగులు తయారుచేసే యంత్రం ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఆమంటల్లో 14 మందికి నిప్పు అంటుకున్నది. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను షాద్నగర్ హాస్పటల్ కు తరలించారు. అయితే వారిలో 11 మంది శరీరాలు 50 శాతానికిపైగా కాలిపోయాయి. దీంతో మెరుగైన చికిత్స వారిని హైదరాబాద్ తరలించారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 50 మందికిపైగా కార్మికులు ఉన్నారని సమాచారం. బాధితులంతా ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారేనని, పొట్టకూటికోసం ఇక్కడికి వలస వచ్చారని తెలిపారు.