లాహోర్‌లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. లాహోర్‌లోని అనార్కలి బజార్ ప్రాంతంలో గురువారం జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మృతి చెందగా, 25మందికి పైగా గాయపడ్డారు. ఈ హఠాత్తు పరిణామంతో ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మేయో ఆస్పత్రికి తరలించారు.

కాగా, లాహోర్‌లోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలోని అనార్కలి బజార్‌లో గురువారం బాంబు పేలుడు జరిగింది. అనార్కలి మార్కెట్‌కు ఆనుకుని ఉన్న పాన్‌మండి సమీపంలో పార్క్ చేసిన మోటార్‌సైకిల్‌లో పేలుడు పదార్థాన్ని ఉంచినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మార్కెట్‌లో పార్క్ చేసిన మోటార్‌సైకిల్‌లో పేలుడు పదార్థాలు ఉన్నాయని, దానిపై పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. పేలుడులో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/