భారత దేశం హిందూ దేశం కావాలంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలు

బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటేనే వివాదం. నిత్యం ఏదోక వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలువడం ఈయన ప్రత్యేకత. ఇటీవలే వివాదస్పద వ్యాఖ్యలు చేశారని ఆయనపై తెలంగాణ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ ఫై బయటకొచ్చిన రాజాసింగ్..తాజాగా భారత దేశం హిందూ దేశం కావాలంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

శనివారం తిరుమల శ్రీవారిని రాజాసింగ్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వెళ్లిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో రాజాసింగ్ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు స్వామివారి తీర్ధ ప్రసాదాలు రాజాసింగ్ కి అందజేశారు. ఆయన తన కుటుంబ సభ్యులు, మరికొందరు కార్యకర్తలతో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. “నేను ఆ దేవుడిని కోరింది ఒక్కటే. అందరం బాగుండాలి. అలానే నా భారత దేశం.. హిందూ రాష్ట్రంగా కావాలి. భారత దేశంలో లవ్ జిహాద్ లాంటివి జరగకూడదని ఆ దేవుడిని ప్రార్థించాను. ఇక రాజకీయల గురించి మాట్లాడితే.. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి. భారత దేశానికి మోడీ ప్రధానమంత్రిగా ఉండాలని దేవుడ్ని కోరుకున్నాను. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ మోసపూరిత మాటలతో పరిపాలన సాగిస్తున్నారు.

బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారు. అలానే మద్యం తెలంగాణగా మార్చారు. ప్రజల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం వద్దు.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది” అని రాజాసింగ్ అన్నారు.