ఎమ్మెల్యే రాజాసింగ్ కు పెను ప్రమాదం తప్పింది.

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు పెను ప్రమాదం తప్పింది. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి రోడ్ ఫై నిలిచిపోయింది. రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ రోడ్డు మధ్యలో ఊడిపోయింది. ప్రమాదం సమయంలో కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో రాజాసింగ్‌కు పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ధూల్‌పేట ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ఘటన జరిగింది. ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచుగా మొరాయిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోపణలకు బలం చేకూర్చుతూ, బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైరు ఊడిపోయింది.

ముందుజాగ్రత్తగా వాహనం నిదానంగా నడపడం వల్లే ప్రమాదం తప్పిందని, ఒకవేళ తాము సాధారణ వేగంతో ప్రయాణించి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సర్కారుకు సిగ్గు అనేది ఉంటే, ఇప్పుడైనా తన పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని స్పష్టం చేశారు. రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇప్పటివరకు పలుమార్లు రోడ్డుపై ఆగిపోయింది. అవసరం లేని వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సమకూర్చుతున్న తెలంగాణ ప్రభుత్వం, తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచుగా మరమ్మతులకు గురవుతున్నా పట్టించుకోవడంలేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేసారు.