బిజెపి రాష్ట్ర అధ్యక్ష పరీశీలనలో ఉత్కంఠ

రేసులో 10 మంది మధ్య పోటీ

Telangana BJP
Telangana BJP

హైదరాబాద్‌: తెలంగాణ బిజెపి అధ్యక్షుడి పదవి కోసం పార్టీలో ఉత్యంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క పదవి కోసం దాదాపు 10 మందికి పైగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నాయకత్వ మార్పు అంశం దాదాపుగా క్లైమాక్స్‌కు చేరుకుంది. కొత్త అధ్యక్షుడిని ఖరారు చేయడానికి ముందు రాష్ట్ర నేతల అభిప్రాయం తీసుకోవాలని భావించిన జాతీయ నాయకత్వం… ఇందుకోసం పార్టీ నేతలు అనిల్ జైన్, బైజయంత్ పండాను రాష్ట్రానికి పంపించింది. రాష్ట్ర నేతలతో సమావేశమైన ఈ ఇద్దరు… ఎక్కువగా కొత్త అధ్యక్షుడి ఎన్నికపై నేతల సలహాలను తీసుకునేందుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అయితే ఈసారి బిజెపిలో అధ్యక్ష పదవి కోసం గతంలో ఎన్నడూ లేనంతగా పోటీ నెలకొంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు ఎంపీలు అరవింద్, సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీమంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తో పాటు కృష్ణసాగర్ రావు, పి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు.

వీరంతా అధ్యక్ష పదవి కోసం తమ పేర్లను పరిశీలించాలని బిజెపి జాతీయ నాయకత్వం పంపించిన పరిశీలకులను కోరినట్టు తెలుస్తోంది. అయితే చాలామంది నేతలు రాష్ట్ర నాయకత్వ మార్పు కచ్చితంగా అవసరమని వారికి సూచించినట్టు తెలుస్తోంది. కొందరు నేతలు ఈసారి అధ్యక్ష పదవి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వారికి కాకుండా ఇతర జిల్లాల వారికి ఇవ్వాలని కోరగా… జీహెచ్ఎంసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని నగరానికి చెందిన నేతనే ఇందుకోసం ఎంపిక చేస్తే బాగుంటుందని మరికొందరు నేతలు జాతీయ నేతలకు సూచించినట్టు సమాచారం. మొత్తానికి బిజెపి కొత్త చీఫ్‌గా ఆ పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందనే అంశం ఉత్కంఠగా మారింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/