బీజేపీలో రోజు రోజుకు పెరుగుతున్న ఆశావహుల దరఖాస్తులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో అధికార పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సిద్ధం కాగా..కాంగ్రెస్, బిజెపి పార్టీలు టికెట్ కోసం పోటీ పడుతున్న వారి దగ్గరి నుండి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. తాజాగా బీజేపీ పార్టీ ఈ నెల 04 నుండి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టగా..నాల్గు రోజుల్లోనే దాదాపు వెయ్యి మంది వరకు దరఖాస్తులు అందించినట్లు తెలుస్తుంది.

మొదటి రోజునే 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ఐదు రోజుల్లో ఆశావహుల నుండి వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి. వేములవాడ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఈ రోజు చెన్నమనేని వికాస్ రావు దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ టిక్కెట్ కోసం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి దరఖాస్తు చేశారు. వరంగల్ వెస్ట్ టిక్కెట్ కోసం ఏనుగు రాకేశ్ రెడ్డి ఆసక్తి చూపారు. కాగా, సీనియర్ నేతలైనా కిషన్ రెడ్డి, బండి సంజయ్, డాక్టర్ కే లక్ష్మణ్ తదితరులు ఇంకా దరఖాస్తు చేయాల్సి ఉందని తెలుస్తోంది.