రాహుల్ గాంధీ విదేశాల్లో అడుగు పెట్టగానే జిన్నా ఆత్మ ప్రవేశిస్తుందిః బిజెపి

విదేశీ గడ్డపై భారత ప్రతిష్ఠను దిగజార్చవద్దన్న ప్రహ్లాద్ జోషి

bjp-leaders-fire-at-rahul-gandhi

న్యూఢిల్లీః ప్రపంచ దేశాలు ప్రధాని నరేంద్ర మోడీని బాస్ అంటే కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలు జీర్ణించుకోలేకపోతున్నారని బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన విదేశాల్లో అడుగు పెట్టగానే ఆయనలో జిన్నా ఆత్మ చేరుతుందన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ కాలిఫోర్నియాలో ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో మోడీ, బిజెపిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తనకు దేవుడి కంటే ఎక్కువ తెలుసునని ప్రధాని మోదీ అనుకుంటారని, భగవంతుడికే ఆయన విశ్వం గురించి వివరిస్తారని ఎద్దేవా చేశారు. అలాగే భారత అభివృద్ధిపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. రాహుల్ వ్యాఖ్యలపై పలువురు బిజెపి నేతలు, కేంద్రమంత్రులు తీవ్రంగా స్పందించారు.

విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ భారత్ ను అవమానించేలా మాట్లాడటం సరికాదని, ప్రధాని మోడీని అవమానించేందుకు ఆయన దేశ ప్రగతిని ప్రశ్నిస్తున్నారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. మన వృద్ధిని ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్న సమయంలో ఆయన దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మోదీని ది బాస్ అంటూ ఆస్ట్రేలియా ప్రధాని ప్రశంసించారని, దీనిని రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.

ఏమీ తెలియని ఓ వ్యక్తి ఇప్పుడు ఉన్నట్లుండి నిపుణుడిగా మారడం హాస్యాస్పదంగా ఉందని, తన కుటుంబం తప్ప మరే చరిత్ర జ్ఞానం లేని ఓ వ్యక్తి చరిత్ర గురించి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మిస్టర్ నకిలీ గాంధీ.. భారత్ అంటే ఓ సంస్కృతి, మీలా విదేశీ గడ్డపై భారత ప్రతిష్ఠను దిగజార్చకూడదన్నారు.

రాహుల్ విదేశాల్లో అడుగు పెట్టగానే ఆయనలో జిన్నా లేదా ఆల్ ఖైదా ఆత్మ ప్రవేశిస్తుందని ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం అంటే ఆయన వారసత్వం అనుకుంటున్నారని విమర్శించారు.