ఖమ్మం లో లక్ష మందితో బిజెపి భారీ బహిరంగ సభ..
తెలంగాణ ఫై బిజెపి పూర్తి ఫోకస్ పెట్టింది. మరో ఐదు , ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతుండడం తో బిజెపి అధిష్టానం దూకుడు పెంచింది. ఇప్పటికే పలు సభలు , సమావేశాలు ఏర్పటు చేసిన బిజెపి ..తాజాగా ఈ నెల 15 న ఖమ్మం లో భారీ సభ నిర్వహించబోతుంది. ఈ సభ కు ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి అమిత్ షా హాజరుకాబోతున్నారు.
ఈ సభ కోసం ఖమ్మంలోని ఎస్పీ స్టేడియం, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ మైదానాలను పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్, జిల్లా నేతలు పరిశీలించారు. అమిత్షా తొలిసారిగా ఖమ్మంలో పర్యటిస్తుండటంతో ప్రజలు పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉందని.. అందుకే సువిశాల ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ మైదానాన్ని ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఈ సభకు దాదాపు లక్ష మంది హాజరవుతారని పేర్కొన్నారు.
మరోపక్క ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నేతలతో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని.. కమ్యూనిస్టులను కేసీఆర్ విమర్శించినప్పటికీ వారు మాత్రం బీఆర్ఎస్ చెంతకే చేరుతున్నారని ఎద్దేవా చేశారు.