గుజరాత్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం.. 12న సీఎంగా భూపేంద్ర ప్రమాణం
అహ్మాదాబాద్ః గుజరాత్ ఎన్నికల్లో బిజెపి భారీ విజయాన్ని సాధించింది. 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి సంపూర్ణ మెజారిటీని సాధించింది. ఇప్పటి వరకు 121 స్థానాల్లో గెలుపొందగా.. 35 ఆధిక్యంలో కొనసాగుతున్నది. కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలువగా.. మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ మూడు స్థానాల్లో గెలుపొందగా.. మరో రెండుచోట్ల లీడ్లో ఉన్నది. భూపేంద్ర పటేల్ గట్లోదియా స్థానం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల్లో బిజెపి విజయాన్ని సాధించడంతో ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేస్తారని బిజెపి గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్ పేర్కొన్నారు. గాంధీనగర్లో పదవీ ప్రమాణస్వీకారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతతో విజయం సాధ్యమైందని, మరోసారి అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
అయితే, ఫలితాలను షాక్కు గురి చేశాయని గుజరాత్ పీసీసీ చీఫ్ జగదీష్ ఠాకూర్ అన్నారు. బిజెపికి మరోసారి అధికారం ఇవ్వాలన్న ప్రజల తీర్పు తనను ఆశ్చర్యానికి గురి చేసిందని, ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ శక్తివంచన లేకుండా కష్టపడిందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/